18 December, 2011

వైభవంగా విజయవిపంచి వెబ్ సైట్ ఆవిష్కరణ


విజయవిపంచి వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమం ఇక్కడి కేశవ నిలయంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ బౌద్ధిక్ ప్రముఖ్ మా. శ్రీ భాగయ్యగారి చేతులమీదుగా వైభవంగా జరిగింది. 

విజయవిపంచి వెబ్ సైట్ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రాంత  సహ సంఘచాలక్ మాన్య శ్రీ ప్యాటా వెంకటేశ్వరరావుగారు అధ్యక్షత వహించగా, మాన్య శ్రీ భాగయ్యగారు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఈ కార్యక్రమం ప్రాంత కార్యాలయం, కేశవ నిలయం, బర్కత్పురాలో 17 వ తేదీ శనివారం స్వయంసేవకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. 

వెబ్ సైట్ లోని విశేషాల గురించి వెబ్ సైట్ టెక్నికల్ డైరెక్టర్ శ్రీ మధుకర్ సభకు తెలియచేసారు. దీనిలో ఒక పాటను వినవచ్చు, నేర్చుకొనవచ్చు, అలాగే పాట స్క్రిప్ట్ ను కూడా చూడవచ్చని తెలియచేసారు. 

వెబ్ సైట్ ఆవిష్కరణ అనంతరం మాన్య శ్రీ భాగయ్య గారు ఈ వెబ్ సైట్ ను తయారు చేసిన కార్యకర్తలను అభినందిస్తూ ప్రసంగించారు. 

స్వయంసేవకుల నుద్దేశించి ప్రసంగిస్తున్న మాన్యశ్రీ భాగయ్య గారు

సాంకేతిక విజ్ఞానాన్ని ఎలా సదుపయోగపరచుకోవచ్చో వారు తెలియచేస్తూ చెన్నై లో గతంలో జరిగిన ఒక చిన్న సంఘటనను తెలియచేసారు. ఒక పర్యాయం చెన్నైలో ఒక తెలుగువారి ఇంటికి వెళ్లి అక్కడ పిల్లలకు వారు ఒక వేమన పద్యమును పాడి వినిపించగా వారు దానికి ఎంతో పరవశులై అలాంటి CD ఒకటి ఉంటే ఇవ్వమని కోరారు.

విజయవిపంచి పాటలు పుస్తకరూపంలో ఉన్నావాటిని వెబ్ సైట్ లో పెడితే వినడానికి బాగుంటుందని అనేకమంది అమెరికా మరియు ఇతర దేశాలనుండి కూడా తమ కోరికను తెలియచేసారు. ఈ వెబ్ సైట్ ఆవిష్కరణతో వారందరి కోరిక తీరుతుందని వారు అన్నారు.

ఇంటర్నెట్ వల్ల చాలా నష్టాలున్నాయని, చెడిపోతున్నారని ఎందఱో వాపోతున్నారు. కానీ సాంకేతిక పరిజ్ఞానాన్ని సవ్యంగా వాడగలిగితే ఎంతోమంది ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఈ వెబ్ సైట్ ద్వారా  ప్రపంచంలో ఏ  మూలనున్నా ఇంటర్నెట్ ద్వారా సంఘ పాటలను వినే అవకాశం ఉంటుందని వారు అన్నారు.

సంఘ పాటలు ఎంతో ప్రేరణదాయకమని తెలియచేస్తూ సామాన్య జనాన్ని రంజింపచేసేది పాట, సంగీతమేనని చెప్పారు. అందుకే మాన్య దేవరస్ గారు సాంఘిక పాటలను ప్రవేశపెట్టారని తెలియచేసారు. మన పాటలను వాయిద్యాలతో పాటు పాడి రికార్డు చేస్తే అవి మరింత హత్తుకుంటాయని అన్నారు.

తాను ఒకసారి టీవీలో భాగవతం హిందీ సీరియల్ లో చూసిన ధ్రువుని కథని గుర్తు తెచ్చుకుని, దానిని యథాతథంగా వివరించారు. ధ్రువుడు తన పిన్నిచే అడవులకు వెడలగొట్టబడినప్పటికీ ఆమెనే తన తల్లిగా భావించి ధ్రువుడు ఆమె  వళ్ళో వాలిపోయి,  "అమ్మా నువ్వు నన్ను అడవులకు పంపడం వల్లనే నేను భగవంతుణ్ణి చూడగలిగాను" అంటాడు. ఆ ప్రేమకు ఆ అమ్మ పరవశురాలై ధ్రువుడిని గుండెలకు హత్తుకున్న సంఘటన వారి కళ్ళల్లో నీరు తెప్పించందని మాన్యశ్రీ భాగయ్య గారు అన్నారు. ఈ ఘట్టం మన ప్రాచీన పాజిటివ్ దృక్పథాన్ని తెలియచేస్తుందని, ఇటువంటి ఘట్టాలను సాంకేతిక పరిజ్ఞానం జోడించి వెబ్ సైట్ లో పెడితే బాగుంటుందని వారు కార్యకర్తలకు సూచించారు.

అలాగే శాఖలో బాలలచే నిర్వహించ బడిన ఒక రూపకం గురించి చెప్పారు. ఇలాంటి ప్రయోగాలు సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించాలని స్వయంసేవకులకు పిలుపునిచ్చారు.

పద్యాలు రాగయుక్తంగా పాడాలని, అవి మన సంస్కృతిని తెలియచేస్తాయని చెపుతూ వారు "తల్లిదండ్రుల మీద ..." అను పద్యాన్ని శ్రావ్యంగా పాడి వినిపించారు. చిన్నప్పుడు అధ్యాపకులు ఇలా పాడి నేర్పించేవారని చెప్పారు. అలాంటి పద్యాలు కూడా ఈ వెబ్ సైట్ లో ఉన్నాయని తెలియచేసారు. ఇది మరింత ముందుకు నడవాలని శుభాశీస్సులు తెలియచేస్తూ ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో క్షేత్ర కార్యకారిణి సదస్యులు శ్రీ హల్దేకర్జి, ప్రాంత ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ జి, శ్రీ జనార్ధన్, శ్రీ లింగం శ్రీధర్, విభాగ్ బౌద్ధిక్ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. 

విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ శ్రీ జయదేవ్ గారి వందన సమర్పణతో కార్యక్రమం ముగిసింది.  

See the Photo Gallery

No comments:

Post a Comment