21 September, 2014

సరస్వతి నది ఉన్నదనేది నిజమా?

సరస్వతి ప్రవహించిన ప్రాంతం
సరస్వతి నాగరికత అసలైన భారత చరిత్రకు సాక్ష్యం

సరస్వతి నాగరికత, సరస్వతి నది గురించి నేడు మనం చదువుతున్న చరిత్ర పుస్తకాల్లో కనిపించదు.

మనది (భారతీయులది) సింధు నాగరికత (Indus valley Civilization) అని, 3300 BC నుంచి 1500 BC కాలం వరకు వర్ధిల్లిందని, ఆ కాలంలో ఇక్కడ ప్రజలు వేరే మతం పాటించేవారని, శివుడు, ఎద్దును పూజించేవారని చెప్తారు. 1800 BC కాలంలో భారతదేశం మీద ఆర్యులు (Aryans) దండయాత్ర చేసి, సింధు నాగరికతను నాశనం చేశారని, వేదాలు ఆర్యుల ద్వారా భారతదేశంలోకి ప్రవేశించాయని, ఆర్యుల చేతిలో ఓడిపోయిన వారు డ్రావిడులని (Dravidians), వాళ్ళు దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారని పాఠశాలలో చరిత్ర పుస్తకాల్లో భోదిస్తారు.

మరికొందరు మరికాస్త ముందుకెళ్ళి, అసలు హిందు ధర్మం భారత దేశానికి సంబంధించినది కాదని, ఇక్కడ డ్రావిడులకు వేరే మతం ఒకటి ఉండేదని, దానిని నాశనం చేసి, దుర్గాపూజు, గోవు(ఆవు) పూజ మొదలైనవి భారతదేశంలోని ఆర్యులు చొప్పించారని వాదిస్తుంటారు. బ్రాహ్మణ క్షత్రియ ఆర్యవైశ్యులు అసలు భారతీయులే కాదని వాదిస్తారు మరికొందరు. మనం అదే చదువుకున్నాం. మన పిల్లలు కూడా అదే చదువుతున్నారు.

వేదాల్లో చెప్పబడిన సరస్వతీ నది అసలు భారతదేశంలో లేదని, అదంతా కేవలం ఒక కల్పితమని, వేదాలనేవి గొర్రెల కాపర్లు కాలక్షేపం కోసం పాడుకున్న పిచ్చి పాటలని, కాలక్రమంలో వాటికి దైవత్వాన్ని ఆపాదించారని ప్రచారం చేస్తున్నారు. అసలు భారతదేశం మీద ఇతర దేశస్థులు వచ్చే వరకు ఇక్కడి ప్రజలు అనాగరికులని, బట్టలు కట్టుకోవడం కూడా రాని మూర్ఖులని చెప్తారు.

ఇదంతా చదివిన తరువాత ఏ భారతీయుడి మనసైనా చివుక్కుమంటుంది. ఆత్మనూన్యత భావం కలుగుతుంది. నిరాశ, నిస్పృహకు లోనవుతారు. ఆత్మగౌరవాన్ని కోల్పోతారు.

మరి అసలు నిజమేంటి?

కాని ఇదంతా నిజం కాదు. ఇందులో నిజం లేదు. నిజానికి మన పిల్లలకు పాఠశాలలో భోధిస్తున్న చరిత్ర అబద్దమని, అసత్యమని, అది నిరాధారమైనదని చెప్పడానికి అనేక సాక్ష్యాలు దొరికాయి. వాటిలో ఒకటి సరస్వతి నది ఆనవాలు.

భారతదేశంలో సరస్వతినది ప్రవహించిందన్నది నిజమని, ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం తప్పని చెప్పుటకు సరస్వతి నది అనవాళ్ళు ఒక మచ్చుతునక. వేల సంవత్సరాల భారతీయ చరిత్రకు సరస్వతీ నది ఒక సాక్ష్యం.

చారిత్రక సాక్ష్యాలు

అసలు లేదు అని ప్రచారం చేయబడిన సరస్వతీ నది భూమిపై ప్రవహించిందనడానికి కొన్ని ఋజువులు దొరికాయి. Michel Danino గారు సరస్వతి నది మీద అనేక పరిశోధనలు చేసి, పురాతన గ్రంధాలు, చారిత్రిక సాక్ష్యాలు, బ్రిటిష్ ప్రభుత్వపు అధికారిక పత్రాలు, పురావస్తు శాఖ Archaeological Survey of India వద్ద ఉన్న సమాచారం, రాజస్థాన్లో చెరువుల మీద చేసిన Pollen Analysis, Oxygen-Isotope ratios మీద జరిపిన పరిశోధనా వివరాలు, Remote Sensing satellite చిత్రాలు మొదలైనవాటిని ఎంతో శ్రమతో సంపాదించి అనేక ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టారు. ఈ నది ఎండిపోవడానికి గల కారణాలు, నది ఏఏ ప్రాంతాల్లో ప్రవహించిందో వంటివి చిత్రాల్లో, మ్యాప్ రూపంలో చూపించే ప్రయత్నం చేశారు.

సరస్వతీ నది ఎక్కడ, ఎప్పుడు ప్రవహించింది?

4000 BCలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభయ్యిందని, ఎండిపోయిన సరస్వతీ నది గర్భం చిత్రాలు మొదలైనవి అత్యాధునిక Satellite SPOT ద్వారా బయటపెట్టారు ఫ్రెంచి శాస్త్రవేత్త, Henri Paul Franc-Fort.

వీళ్ళ పరిశోధనల ప్రకారం ఋగ్వేదంలో ప్రస్తావించబడిన సరస్వతి నది దాదాపు 4000 ఏళ్ళ క్రితం వరకు ఈ భూమిపై ప్రవహించిందన్నది కాదనలేని సత్యం.

దీని తోడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO కూడా ఈ నది మూలాలు, ఉనికి గురించి కనుక్కునే ప్రయత్నం చేసింది. Indian Remote Sensing Satellite సమాచారం, Digital elevationతో కొన్ని చిత్రాలను విడుడల చేసింది. Palaeo channels (నది యొక్క పాత ప్రవాహ మార్గం) ను కనుగొనె ప్రయత్నం చేసింది. Palaeo channelsతో పురాతన ఆనవాళ్ళను, చారిత్రిక ప్రదేశాలను,hydro-geological data, drilling dataను పోల్చి చూసింది. సరస్వతీ నది భారతదేశానికి వాయువ్య దిశలో ప్రవహించిందని తేల్చారు. హరప్పా నాగరికతకు (Harappa Civilization) చెందిన కాలిబంగన్ (Kalibangan- (Rajasthan) వంటి ముఖ్యమైన ప్రదేశాలు, Banawali, Rakhigarhi (Haryana), Dholavira, Lothal (Gujarat), అన్ని నగరాలు  సరస్వతీ నది తీరాన పరిఢవిల్లాయని నిర్ధారణకు వచ్చారు.


 
తూర్పు నుండి పశ్చిమానికు ప్రవహించిన సరస్వతి

సరస్వతి నది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో గర్హ్వాల్ ప్రాంతంలో హర్-లి-దున్ అనే గ్లాసియర్ వద్ద యమునా నదితో పాటూ ఉద్భవించి, ఉత్తరాఖండ్, హర్యాన, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదుగా 1500 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గుజరాత్ రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో కలిసేది అని ఋజువైంది. అంటే పశ్చిమ/పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసేది (గంగ పడమర నుండి తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది). ఋగ్‌వేదంలోని 7వ మండలం ప్రకారం సరస్వతి నది పర్వతాల (హిమాలయాల) నుంచి కొండల ప్రాంతం గుండా ప్రవహిస్తూ సముద్రంలో కలిసేదని, అనేక మందికి జీవనాధరం లభించేదని అని చెప్పబడింది.

యమున, సరస్వతి కొద్ది దూరం సమాంతరంగా ప్రవహించిన తరువాత యమునా నది సరస్వతి నదిలో కలిసేది. యమునతో పాటు శతదృ (సట్లెజ్/Sutlej), హక్రా, ఘగ్ఘర్ మొదలైన నదులు హిమాలయల్లో జన్మించి, కొద్ది దూరం ప్రవహించి సరస్వతి నదిలో కలిసేవి. పూరాణాలు, ఆధునిక పరిశోధనలు రెండూ ఈ విషయాలను ధృవపరుస్తున్నాయి.

యమున, శతదృ నిత్యం నీటితో నిండి ఉండేవి. సరస్వతి నదీ ప్రవాహానికి అత్యధికంగా యమున, శతదృ(సట్లెజ్) నదులు నీరు అందించేవి. ఋగ్‌వేదంలో [10.75.5] సూక్తంలో భారతదేశంలో తూర్పు నుంచి పశ్చిమ దిశవరకు ప్రవహించే నదులు ప్రస్తావన ఉన్నది.

అందులో సరస్వతి, శతదృ, విపస(బీస్/beas), వితస(జేలం/jhelum), పరుషిని(రవి/ravi), అస్కిని(చీనబ్/cheenab), యమున, ద్రిషదవతి, లవణవతి మొదలైన నదులు ఉన్నాయి. కానీ కాలక్రమంలో ఈ నదులన్నీ తమ ప్రవాహ దిశను మార్చుకున్నాయి. వాటిలో సరస్వతీ, ద్రిషదవతి, లవణవతి నదులు ప్రస్తుతం కనుమరుగయ్యాయి.

సరస్వతి నది ఎందుకు ఎండిపోయింది?

భారతదేశంలో అనేకమందికి జీవనాధారమని, అతి పెద్ద విశాలమైన నది అని సరస్వతి నది గురించి మన గ్రంధాల్లో కనిపిస్తుంది. సరస్వతినది మీద జరిగిన పరిశోధనల ప్రకారం నదీగర్భం 3 నుంచి 15 కిలోమీటర్ల వెడల్పు(width) కలిగి ఉంది.

సరస్వతీ నది గత 6000 ఏళ్ళ క్రితం ఎండిపోవడం మొదలైంది. మొదటగా నదిప్రవాహం తగ్గుతూ వచ్చింది. గత 4000 సంవత్సరాల క్రితం నాటికి ఈ భూమి పైనుంచి కనుమరుగయ్యిందని ఆధినిక పరిశోధనలు చెప్తున్నాయి.

సరస్వతీ నది ఎండిపోవడానికి కారణం భూమి యొక్క Tectonic Platesలో వచ్చిన మార్పులేనట. ఇదే సమయంలో సరస్వతి నదికి అత్యధికంగా నీరు అందించే ఉపనదులైన యమున, సింధు నదులు తమ ప్రవాహా మార్గాన్ని మార్చుకున్నాయి. యమునా నది పంజాబ్ ప్రాంతంలో సరస్వతీ నదీ ప్రవాహాన్ని తన ప్రవాహంలో కలిపేసుకుని గంగానదిలో కలవడం ప్రారంభమయ్యింది.

Tectonic Platesలో కలిగిన మార్పుల కారణంగా ఆరావల్లి పర్వతాలు పైకి జరిగాయి. దీని ప్రభావంతో వాయువ్య భారతంలో నదీ ప్రవాహాల్లో తీవ్రమైన మార్పు వచ్చింది. శతదృ(సట్లెజ్) పశ్చిమానికి తిరిగి విపస(బీస్), సింధు(ఇండస్) నదులలో కలవడం ప్రారంభించింది.

ఈ కారణాల చేత సరస్వతీ నది నీటి ప్రవాహం తగ్గుతూ వచ్చి, కొంతకాలానికి భూమిపైన ప్రవహించకుండా భూమి అడుగు భాగంలో అంతర్వాహినిగా మారిపోయింది.

కేవలం భారత్‌లోనే కాదు, ప్రపంచంలో ఇతర ప్రాంతాల్లో నది తీరాల్లో వెలిసిన మరికొన్ని నాగరికతలు కూడా టెక్‌టొనిక్ ప్లేట్లలో కలిగిన మార్పుల వల్ల కొన్ని ధ్వంసం అవ్వగా, కొన్ని వైభవాన్ని కోల్పోయాయి.

సింధు నాగరికతలో (Sindhu/Indus Valley Civilization) సింధు నది పక్కన 30 పైగా చారిత్రాత్మిక స్థలాలను పురావస్తు శాఖ గుర్తించారు, కానీ సరస్వతి నదీ గర్భం వెంబడి దాదాపు 360 పైగా ముఖ్యమైన పురాతన ప్రదేశాలు ఉన్నాయి. మనం పాఠశాలలో చదువుకున్న హరప్పా నాగరికత కూడా ఇందులో భాగమే.

ఆర్యులు భారతదేశం మీద దండయాత్ర చేసి ద్రావిడుల మీద యుద్ధం చేయడం వల్ల హరప్పా నాగరికత అంతం అవ్వలేదు. ఈ దేశంలో భౌగోళికంగా జరిగిన మార్పులు ప్రభావం వలన సరస్వతి నది ఎండిపోయింది. హరప్పా నాగరికత ముగియడానికి కారణం సరస్వతి నది ప్రవాహం ఆగిపోవడమే.

భారత్, పాకిస్థాన్, రొమానియ, US, UK కు చెందిన శాస్త్రవేత్తల బృందం state-of-the-art Geoscience technology ని ఉపయోగించి హరప్ప నాగరికత గురించి కొన్ని విశేషాలను బయటపెట్టారు. హరప్పా ప్రజలు అత్యంత అనుకూలమైన వాతావరణంలో జీవనం సాగించారని, వాతావరణంలో కలిగిన మార్పుల కారణంగా అతివృష్టి, అనావృష్టి ఏర్పడి హరప్ప నాగరికత పతనం 4000 ఏళ్ళ క్రితం మొదలైందని తేల్చారు. 10,000 సంవత్సరాల క్రితం నుంచి ఆ ప్రాంతపు భూభాగంలో ఏర్పడిన మార్పులను పరిశీలించారు. గాడి తప్పిన ఋతుపవనాలు కూడా హరప్పా నాగరికతకు హాని చేసిందని నివేదిక ఇచ్చారు.

మరిన్ని ఆధునిక పరిశోధనలు కూడా సింధూ నాగరికత సరస్వతీ నది తీరం వెంబడి ఉన్నదేనని, వాతావరణ మార్పులు కారణంగా గందరగోళంగా తయారయ్యిందని చెప్తున్నాయి. ఈ మార్పుల కారణంగా హరప్పా ప్రజలు జీవం కోసం ఇతర ప్రదేశాలకు తరిలిపోయారు. ఈ సమయంలో వీరు అత్యధికంగా గంగానది తీరం వైపు పయనించారు. అంతేకానీ, ద్రావిడులను ఓడించిన ఆర్యులు వారిని దక్షిణ భారతదేశానికి పంపించి గంగా తీరంలో స్థిరపడ్డారనడానికి ఏ విధమైన ఆధారాలు లేవు.

మహాభారతంలో సరస్వతి నది గురించిన ప్రస్తావన

మహాభారతం 1.90.25.26 లో అనేక మంది మహారాజులు సరస్వతి నదీ తీరంలో యజ్ఞయాగాలు చేశారని ఉన్నది. సరస్వతి నది గర్భానికి దగ్గరలో ఉన్న హరప్పా నాగరికతలో భాగమైన కాలిబంగన్‌లో పురాతన యజ్ఞగుండాల అవశేషాలు తవ్వకాల్లో బయటపడ్డాయి. యజ్ఞగుండాలు/ అగ్నిహోత్రాలు ఉన్నది ఒక్క వేద ధర్మంలో మాత్రమే. హరప్పా నాగరికత ప్రజలు హిందువులనడానికి ఇది ఒక్కటి సరిపోతుందేమొ.

మహభారతం జరిగి ఇప్పటికి 5150 సంవత్సరాలు గడించింది. మహాభారతం సరస్వతి నది ఎండిపోవడం గురించి ప్రస్తావిస్తూ వినాశన/ఉపమజ్జన మొదలైన ప్రాంతాల్లో సరస్వతినది కనిపించడం లేదని చెప్తోంది.

బలరాముడు సరస్వతి నదిలో యాదవుల చితాభస్మాన్ని కలిపి, ద్వారక నుంచి మధురకు ప్రయాణించాడని ఉంది.

అంతేకాదు మహాభారత సమయానికి సరస్వతీ నది ఎండిపోవడం ప్రారంభమయ్యింది. ఎంతో పవిత్రమైన సరస్వతినది ఎండిపోవడం తట్టుకోలేని బలరాముడు యుద్ధంలో పాల్గొనకుండా వైరాగ్యంతో సరస్వతీ నది తీరంలో ఉన్న అనేక పుణ్య క్షేత్రాల దర్శనం చేసుకున్నాడు. సరస్వతి నది 6000 ఏళ్ళ క్రితం నుంచి ప్రవాహం తగ్గిపోయి 4000 ఏళ్ళ క్రితం కనుమరుగయ్యింది. అది కనుమరుగవడానికి 1000 సంవత్సరాల ముందు పరిస్థితిని మహాభారతం వివరిస్తోంది.

సరస్వతి నది ఎండిపోవడానికి ఒక కారణం ద్వాపరయుగాంతం

సాధారణంగా యుగాంతం అనగానే చాలామంది ప్రళయం వచ్చి ప్రపంచమంతా నాశనం అవుతుందని అనుకుంటారు. కల్పం అంటే 4.32 బిల్లియన్ సంవత్సరాలు. కల్పాంతానికి సమస్త సృష్టి మొత్తం నాశనమవుతుంది. యుగాంతం జరిగి కొత్త యుగం ప్రారంభమయ్యే కాలంలో ప్రళయం రాదు కానీ, అనేక భౌగోళిక మార్పులు సంభవిస్తాయి.

ఒక యుగం అంతమై కొత్త యుగం ప్రారంభమయ్యే సమయంలో సంధికాలం అంటూ కొంత ఉంటుంది. యుగం అంతవమవ్వగానే ఒక్కసారే ప్రపంచంలో మార్పులు సంభవిస్తాయని చెప్పలేము. ఒక యుగం అంతమవ్వడానికి కొంతకాలం ముందు నుంచి కొత్త యుగం ప్రారంభమైన కొంత కాలం వరకు అనేక మార్పు చోటుచేసుకుంటాయి. యుగాంతంలో అత్యధిక జనాభా నాశనమవుతుంది.

8,64,000 సంవత్సరాల ద్వాపరయుగం 17 ఫిబ్రవరి 3102 BC లో ముగిసింది. దీనికి 36 ఏళ్ళ ముందు మహాభారతం అనే మహాప్రపంచయుద్ధం జరిగి ప్రపంచ జనాభ నాశనమైంది. అణుబాంబులు పడి అనేక నాగరికతలు ధ్వంసమయ్యాయి. ప్రపంచం మొత్తం ఈ యుద్ధంలో పాల్గొన్నది.

ద్వాపరయుగాంతం ప్రభావం చేత యుగాంతానికి ముందు సంధికాలంలో సరస్వతి నది ఎండిపోవడం ప్రారంభమైంది. ఇది ఒకటే కాదు, మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే ఇదే సమయంలో ప్రపంచంలో కూడా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. సుమేరియా నాగరికత 2200 BC కి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఈజిప్ట్ రాజ్యం కూడా సరిగ్గా ఈ సమయంలోనే అంటే సంధికాలంలోనే వాతావరణ మార్పుల కారణంగా పతనమైంది. ఇక పచ్చని మైదాన ప్రాంతమైన సహార గత 4000 ఏళ్ళ క్రితం చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా ఏడారిగా మారిపోయింది. అన్నిటికంటే ముఖ్యమైనది, ద్వారకానగరం ద్వాపరయుగాంతం సమయంలోనే సముద్రంలో కలిసిపోయింది. అది ఈనాటికి అరేబియా సముద్రంలో ఉంది. ఇవన్నీ కూడా యుగాంతం ప్రభావమే. వాటిలో భాగమే సరస్వతి నది అంతర్ధానం.

150 మిల్లీమీటర్ల కంటే అతి తక్కువ వర్షపాతం, అధిక ఉష్ణోగ్రతలు కలిగిన జైసల్మర్ జిల్లాలో భూగర్భ జలాలు 40-50 మీటర్ల లోతులో అందుబాటులో ఉంటాయి. అక్కడ బావులు నిత్యం జలంతో కళకళలాడుతూ ఉంటాయి. ఎప్పుడు ఎండిపోవు. అక్కడున్న భూగర్భ జలాలను పరిశీలిస్తే Tritium content అతి తక్కువగా ఉంది. అంటే ఇవి ఈ కాలంలో నీటి సంరక్షణా చరియల క్రింద నేలలో ఇంకిన నీరు కాదుట. Independent Isotope analyses మరియు Radiocarbon data ప్రకారం ఇసుకతిన్నెల కింద ఉన్న ఈ మంచినీరు కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని తేలింది.

రాజస్థాన్ ఎడారిగా మారడానికి కారణం సరస్వతి ఎండిపోవడమే

రాజస్థాన్‌లో మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన పరిశోధనల్లో అక్కడ అందుబాటులో ఉన్న నీరు 4000-8000 ఏళ్ళ క్రితం నాటివని తేల్చారు. అసలు ఏడారి ప్రాంతంలో భూగర్భంలో మంచినీరు దొరకడమేంటని పరిశీలిస్తే ఈ నీరు వేల సంవత్సరాల క్రితం పవిత్ర భారతభూమిలో ప్రవహించిన సరస్వతి నది నీరని నిర్ధారణకు వచ్చారు. మరొక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రాజస్థాన్ ప్రాంతం ఏడారిగా మారిపోవడానికి కారణం సరస్వతీ నది ఎండిపోవడమే అని చెప్తున్నారు.

ఇలా నిర్ధారించడానికి కారణం లేకపోలేదు. వీళ్ళకు దొరికిన శుద్ధజలాలన్నీ ఎండిపోయిన సరస్వతి నది గర్భం ఉన్న ప్రాంతంలోనివేనట. ఈరోజు శాస్త్రవేత్తలు కూడా రాజస్థాన్‌లో భూగర్భంలో ఉన్న సరస్వతీనది నీటిని వెలికితీసే ప్రయత్నంలో ఉన్నారు. ఇక్కడ భూగర్భంలో ఉన్న నది నీటిని పైకి తీసుకురావడం ద్వారా రాజస్థాన్ ప్రాంతంలో నీటి కరువును తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.

సరస్వతినది ఋగ్వేదంలో చెప్పబడింది. హిమాలయ పర్వతాల్లో ఉద్భవించి పర్వతప్రాంతాల మీదుగా పాలవంటి స్వచ్చమైన ప్రవాహం కలిగి, తన ప్రయాణమార్గంలో మనుష్యులకు, పశువులకు జీవనాధారమైనదని ఉంది. సరస్వతి నది తీరంలో వెన్న, నెయ్యి మొదలైనవి పుష్కలంగా ఉండేవని, ఈ నది తీరంలో ఉన్న పశుసంపద గురించి కూడా ఋగ్‌వేదం చెప్తోంది. ఈ విధంగా సరస్వతి నది నిండుగా ప్రవహించింది 8000 సంవత్సరాల క్రితం మాత్రమే. 6000 క్రితమే సరస్వతి నది ప్రవాహంలో మార్పులు మొదలయ్యాయి.

ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం పచ్చి అబద్ధం

కాసేపు పచ్చి అబద్ధమైన ఆర్యుల దండయాత్ర సిద్ధాంతం నిజం అనుకుందాం. ఆర్యులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చింది 1800 BC లో. సరస్వతి నది 2000 BC నాటికి పూర్తిగా ఎండిపోయింది. 5000 ఏళ్ళ క్రితం జరిగిన మహాభారత యుద్ధం నాటికే కొన్ని ప్రదేశాల్లో నది ప్రవాహం కనిపించలేదు. అంటే ఆర్యులు భారతదేశం మీద దండయాత్రకు వచ్చే నాటికి సరస్వతినది అనేది ఈ భూమి మీద లేనేలేదు. వేదాలు వారివే అంటున్నారు కదా. మరి వేదాల్లో 8000 సంవత్సరాల క్రితం నది ప్రవాహం గురించి ఎలా ప్రస్తావించబడింది? దానితో పాటు ప్రవహించిన ద్రిషదవతి, లవణవతి గురించి వారికి ఏలా తెలిసింది. 2000 BC నాటికి సరస్వతి నది కనుమరుగయ్యింది కానీ అంతకు చాలాకాలం ముందే అది చిన్న పిల్లకాలువలా మారిపోయింది. ఒక వేళ ఇక్కడ ఒక నది ప్రవహించిందని ఆర్యులకు తెలిసినప్పటికి అది ఒక కాలువ అని మాత్రమే అనుకునేవారు. మిగతా నదులు తమ గమనాన్ని మార్చుకున్నాయి. ఆర్యులు దండయాత్ర సిద్ధాంతం నిజమే అయితే సరస్వతి నది సహజ రూపం, మిగతా భారతదేశ నదుల గురించి అసలు వేదాల్లో ప్రస్తావనే ఉండేది కాదు.

సరస్వతి-సింధు నాగరికత

3300-1300 BC మధ్య భారతదేశపు వాయువ్యదిశలో సింధునాగరికత (Indus Valley Civilization) విలసిల్లిందని మనం చదువుకున్నాం. ఈ సింధు నాగరికత సింధు, హక్రా, గగ్గర్ నదులు పరీవాహిక ప్రాంతంలో ఉన్న ప్రపంచపు అతి ప్రాచీన నాగరికత. ఇది ప్రాధమికంగా పాకిస్థాన్‌లో గల సింధ్ మరియు పంజాబ్ ప్రావిన్సులలో, పశ్చిమం వైపు బెలూచిస్తాన్ ప్రావిన్సు వైపుకు కేంద్రీకృతమైనట్లు తెలుస్తుంది. ఇంకా ఆఫ్ఘనిస్తాన్, తుర్కమేనిస్తాన్, ఇరాన్ దేశాలలో కూడా ఈ నాగరికతకు సంబంధించిన శిథిలాలను వెలికి తీశారు. ఇది మహారాష్ట్రలో కొంతప్రాంతం వరకు ఉండేదని కూడా తెలుస్తోంది. 126000 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించడం వల్ల ప్రపంచంలో పురాతన నాగరికతలలో అతి పెద్దదిగా చెప్తారు.

హరప్పా నాగరికతకు చెందిన అవశేషాలు దొరికిన తరువాత, హరప్పా, మొహంజిదారొ మొదలైనవన్నీ సింధూ-నాగరికతలో భాగం అని భావిస్తూ వచ్చారు. ఇక్కడ నివసించిన ప్రజలు ద్రావిడులనీ, ఇక్కడి నుంచే భారతదేశ చరిత్రను చెప్పడం ప్రారంభించారు.

కానీ రాజస్థాన్ భూగర్భంలో దొరికిన పురాతన సరస్వతినది ఆనవాళ్ళూ, సరస్వతినది భూగర్భం మీద జరిగిన పరిశోధనలు భారతీయ చరిత్రను మరింత వెనక్కు తీసుకువెళ్తున్నాయి. సింధూ నాగరికత మొత్తం సరస్వతి నాగరికతలో భాగం అని, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఇతర నదుల వద్దకు జీవనం కోసం తరలిపోయారని చెప్తున్నారు. సింధూ నాగరికతలోని చారిత్రక స్థలాలన్నీ సరస్వతినది గర్భం చుట్టుపక్కల ఉండడం ఈ వాదనను బలపరుస్తోంది. అందువల్ల భారతదేశంలో సరస్వతి-సింధు నాగరికత (Saraswati - Sindhu Civilization) విలసిల్లింది. ఇప్పటివరకు సింధూ నాగరికత ఒక 4000-5000 సంవత్సరాల క్రితం కాలానికి సంబంధిం చినదైతే, సరస్వతి - సింధూ నాగరికత కనీసం 8000 సంవత్సరాల క్రితంది.

మన ప్రజలు చాలా తెలివైనవారు
 
మరో విశేషమేంటంటే, సింధూ నాగరికత ప్రజలు చాలా తెలివైనవారు. భూగర్భ డ్రైనేజి (Under ground Drainage System), బహుళ అంతస్తుల భవనాలతో, పెద్దపెద్ద రోడ్లు మొదలైనవన్నీ వారి నగర నిర్మాణ (Town Planning) కళకు అద్దం పడుతున్నాయి. ఇవన్నీ అక్కడ దొరికిన అవశేషాల ఆధారంగా చరిత్రకారులు చెప్తున్నారు. ఇవన్నీ కూడా సరస్వతి నాగరికతలో భాగమే. ఇంత గొప్ప పరిజ్ఞానం ఆ కాలంలోనే ప్రజలకు ఉంది.

భారతదేశం 8000 ఏళ్ళకు పూర్వమే అపూర్వంగా, అద్భుతంగా వెలిగిపోయిందడానికి సరస్వతినది ఆనవాళ్ళు, సరస్వతి నాగరికత చిన్న ఉదాహరణలు మాత్రమే.

నేటి మన దుస్థితికి కారణం మనవారే

ఏ దేశస్తులైనా తమ దేశం గురించి గొప్పగా చెప్పుకోవడానికి ఎంతో ఇష్టపడతారు. ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. చైనాలో 2000 ఏళ్ళ క్రితం నాటి ఒక పురాతన సమాధి బయటపడితే దాని గురించి బహుగొప్పగా ప్రపంచానికి చెప్పుకున్నారు చైనీయులు. కానీ మన దేశంలో 4000 ఏళ్ళ క్రితం వరకు ప్రవహించిన ఒక నది ఆనవాళ్ళు బయటపడి, మన దేశపు చరిత్రను తిరగరాసే అపూర్వమైన అవకాశం మనకు వస్తే మనం మాత్రం అసలు పట్టించుకోలేదు. ఇది మన 'దేశ భక్తి'. మన రాజకీయ నాయకులు సరేసరి.

సంస్కృతికి మతం రంగు

భారతీయసంస్కృతి యొక్క వైజ్ఞానిక, చారిత్రిక సత్యాలను బయటపెట్టి, సనాతన వైదిక(హిందూ) ధర్మం యొక్క పురాతన వైభావాన్ని ప్రపంచానికి సరస్వతి నది ప్రపంచానికి చాటితే అది భారతీయులకు గర్వకారణం. భారతీయత ఈనాటి కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటిదని, ప్రపంచానికి కనీసం బట్టలు కట్టుకోవడం కూడా రాని సమయంలో ఈ దేశంలో అద్భుతమైన శాస్త్రీయ పరిజ్ఞానం ఉందని చెప్పుకోవడం కులమతాలకు అతీతంగా ప్రతి భారతీయుడికి ఎంతో గర్వంగా ఉంటుంది. కానీ నీచపు ఆలోచనలు కలిగిన మన రాజకీయ నాయకులు మన దేశపు కీర్తికి సంబంధించిన అంశానికి మతం రంగు పులిమారు.

పాశ్చాత్య కాంగ్రెస్ పాలన దీనికి ఒక కారణం

మన దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం, కొంత మంది చరిత్రకారులు భారతీయ చరిత్ర గుర్రాలమీద కత్తులు పట్టుకుని (ఎక్కడ నుంచో వచ్చారొ తెలియదు కానీ) ఈ దేశం మీద దండయాత్రకు వచ్చిన శ్వేతవర్ణపు ఆర్యులు ద్రావిడులను దక్షిణానికి వెళ్ళగొట్టడంతో మొదలైందని 'నమ్మిస్తు' వస్తున్నారు.

అంతకు ముందు ఈ దేశంలో ఏమి జరిగినా అదంతా కల్పితము, మూఢనమ్మకము మాత్రమేనట. ముఖ్యంగా హిందువుల విషయంలో ఏమి జరిగినా అది మాత్రం అసత్యమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. చరిత్ర కాస్త కఠినంగా ఉన్న దాన్ని ఈ రోజు కాకపోతే ఏదో ఒకరోజైన ఆధునిక 'సెక్యులర్' వ్యవస్థ ఎదుర్కోనాలి.

కుహనా సెక్యులరిజం

సరస్వతి అనేది ఒక మతానికి సంబంధించిన దేవత పేరట (నిజానికి పరిశోధన సరస్వతి దేవి మీద కాదు, భారతీయ చరిత్రకు సరికొత్త నిర్వచనం ఇచ్చే సరస్వతినది మీద. సరస్వతి నది ఒక మతానికి కాదు ఈ భరతజాతికి సంబంధించినదన్న కనీసం జ్ఞానం కూడా పాలకులకు లేకుండా పోయింది.) ఆమె పేరుతో జరిగే ఏ పరిశోధనలకు నిధులిచ్చినా అది మిగితావారి మనోభావాలను దెబ్బతీస్తుందట. 'సెక్యులర్'భావాలకు అది భిన్నంగా ఉంటుందట. అందుకే అధికారంలోకి రాగానే 'సెక్యులరిసం' పేరుతో ఈ దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం సరస్వతినదికి నిధులివ్వడం ఆపేసింది.

మన ప్రభుత్వం - మన అభివృద్ధి

2003-04 లో అప్పటి బిజేపి-ఎన్‌డిఏ ప్రభుత్వంలో కేంద్ర సాంస్కృతిక మరియు పర్యాటక శాక మంత్రి జగ్‌మోహన్ సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్టును ప్రవేశపెట్టారు. ఋగ్‌వేదంలో చెప్పబడిన సరస్వతినది, హరప్పా నాగరికత పతనమవడానికి కారణమై, నేడు భూగర్భంలో ప్రవహిస్తున్న నది ఒకటేనని ఋజువు చేసేందుకు పూనుకున్నారు.

ఈ ప్రాజెక్టుకు జనసంఘ్, మిగతా హిందూ మరియు ఇతర చరిత్రకారులు దీనికి తమ మద్దతు తెలిపారు. నాస్తికులైన వామపక్షాలు, వామపక్ష చరిత్రకారులు హరప్పా నాగరికత ప్రాంతంలో ఒక నది ప్రవహించేదని ఒప్పుకున్నప్పటికి, అది సరస్వతి నదే అని పరిశోధించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రాజెక్టు మొదలై 2003 నవంబరులో సాంస్కృతిక, పర్యాటక మరియు రవాణా శాఖకు చెందిన పార్లమెంటు స్టాండింగ్ కమిటి వివరాలు సేకరించింది.

2004లో మరల అశనిపాతం

2004లో కేంద్రంలో ప్రభుత్వం మారి, కాంగ్రెస్ పాలిత యూ.పి.ఏ. ప్రభుత్వం అధికారం చేపట్టగానే మొట్టమొదటగ సరస్వతి నది మీద భారత పురావస్తు శాఖ చేస్తున్న పరిశోధనకు నిధులు కేటయించడం ఆపేసింది. ఆ ప్రాజెక్టును అధికారికంగా రద్దు చేసింది. మైనారిటి ఓటుబ్యాంకు రాజకీయాలు, కమ్యూనిస్టుల ఒత్తిడి, హిందూ వ్యతిరేక విధానాలు, ఇతర దేశాలు, మత సంస్థల ప్రోద్బలంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇదేదో హిందువులకు మాత్రమే సంబంధించిన అంశంగా పరిగణించింది.

సమయస్ఫూర్తితో వ్యవహరించిన మన పురావస్తు శాఖ

కానీ భారతీయులు అదృష్టవంతులేమో. అందుకే భారత పురావస్తు శాఖ సరస్వతి నది అంశంలో ఒక చక్కటి పరిష్కారం దొరికే వరకు పరిశోధన కొనాసాగించాలని భావించింది. ప్రభుత్వం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికి తన పరిశోధన ఆపకుండా నిధుల కోసం ప్రాజెక్టు పేరు మార్చింది.

వానాకాలంలో హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజస్థాన్ మీదుగా అరేబియా సముద్రంలో కలిసే గగ్గర్ అనే నది పేరు పెట్టింది. వివిధ రాష్ట్రాల్లో రకరకాల పేర్లతో ఈ ప్రాజెక్టును కొనసాగిస్తోంది.

జాతి ప్రయోజనాలకంటే మన రాజకీయ నాయకులు స్వప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. తమ వాదన నెగ్గితే చాలు అనుకుంటారు. ఇందుకు ఉదాహరణ సరస్వతి హెరిటేజ్ ప్రాజెక్ట్‌కు నిధులను నిలిపివేసి దాన్ని రద్దు చేయడమే.

2014లో మరల ప్రతిష్ఠాపింపబడిన ఎన్.డి.ఏ. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన అవగాహనతో పనిచేస్తుందని ఆశిద్దాం.

Source : Hariseva

1 comment:

Kanta Rao Vulli said...

వ్యాసం చాలా వివరణాత్మకంగా ఉన్నది. నరేంద్రమోది ప్రభుత్వం మరింత కృషి చేసి సరస్వతి నదిని పుష్కరాలు చేసుకునేటంతగా అభివృద్ధిలోకి తేగలదనే నమ్మకం నాకున్నది. త్వరలో ఆ కల నిజం కావాలని ఆశిద్దాం.

Post a Comment