23 October, 2014

ఆర్.ఎస్.ఎస్. క్షేత్ర సంఘచాలక్ టి.వి.దేశ్ ముఖ్ కన్నుమూత


టి.వి.దేశ్ ముఖ్ (ఫైల్ ఫోటో)
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల క్షేత్ర  సంఘచాలక్ గా శ్రీ టి.వి.దేశ్ ముఖ్ ఈ రోజు ఉదయం 11 గంటలకు (23 అక్టోబర్, 2014 - దీపావళి పండుగ నాడు) హైదరాబాద్ లో స్వర్గస్తులయ్యారు. స్వర్గీయ దేశ్ ముఖ్ గడచిన కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వారు ఈ రోజు కన్నుమూశారు. 

స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ బాల్యం నుంచే స్వయంసేవక్ గా ఉన్నారు. వారి మేనమామగారు శ్రీ సీతారామారావు గారు నల్గొండ జిల్లాలో ఖండ సంఘచాలక్ గా పని చేశారు. వారి ద్వారా  టి.వి.దేశ్ ముఖ్ గారు సంఘ పరిచయం లోకి వచ్చారు.  స్వయంసేవక్ అయిన  అనంతరం నుండి నేటి వరకు శ్రీ టి.వి.దేశ్ ముఖ్ సంఘ పనిలో కొనసాగుతూనే ఉన్నారు. సంఘ కార్యకర్తగా క్రియాశీలంగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు.

స్వర్గీయ దేశ్ ముఖ్ 1994 నుండి 2012 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చమి ప్రాంతానికి (పశ్చిమ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం) ప్రాంత సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2012 మార్చిలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నాటి ఆంధ్ర ప్రదేశ్ - కర్నాటక రాష్ట్రాల క్షేత్ర  సంఘచాలక్ గా ఎన్నికయ్యారు. 

2012లో భాగ్యనగరంలో నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న స్వర్గీయ దేశ్ ముఖ్ (ఫైల్ ఫోటో)

స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ పూర్తి పేరు తెడ్లపల్లి వెంకట నరసింహరావ్ దేశ్ ముఖ్. పాలమూరు స్వగ్రామం. వారు 1946 జూలై 29 నాడు పాలమూరు జిల్లాలోలని వంగూరు గ్రామంలో జన్మించారు. విద్యాభ్యాసం అనంతరం ప్రచారక్ గా వచ్చి, మూడున్నర సంవత్సరాల పాటు నిజామాబాద్ జిల్లాలోని బోధన లో పని చేశారు. అనంతరం వివాహం చేసుకొని భాగ్యనగరంలోనే స్థిరపడ్డారు. వివాహానంతరం భాగ్యనగర్ దక్షిణ భాగ్ సంఘచాలక్ గా, అనంతరం నేరుగా పశ్చిమాంధ్ర ప్రదేశ్ ప్రాంత సంఘచాలక్ గా ఎన్నికై, నిరంతర క్రియాశీలకంగా ఉంటూ సుదీర్ఘ కాలం పాటు పని చేశారు. ప్రాంత సంఘచాలక్ గా ఈ ప్రాంతంతోనూ, స్వయంసేవకులతోనూ వారికెంతో అనుబంధం ఉంది. 2012 నుండి క్షేత్ర సంఘచాలక్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రాంత సంఘచాలక్ గా, క్షేత్ర సంఘచాలక్ గా ప్రాంతంలోను, క్షేత్రంలోనూ జరిగిన వివిధ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ స్వయంసేవకులకు చక్కటి మార్గదర్శనం చేశారు. జన జాగరణ ఉద్యమాలలోనూ, వివిధ ప్రకృతి బీభత్సాలలో సంఘం నిర్వహించిన సేవా కార్యక్రమాలలోనూ (కర్నూలు, పాలమూరు లలో వచ్చిన వరదలు మొదలైన వాటి సందర్భాలలో) చురుకుగా పాల్గొని సమర్ధంగా నిర్వహించారు. 

సంఘ కార్యకర్తగానే కాక వివిధ సామాజిక కార్యకలాపాలలో కూడా స్వర్గీయ టి.వి.దేశ్ ముఖ్ క్రియాశీలకంగా పని చేశారు. జాగృతి ప్రకాశాన్ ట్రస్ట్ సభ్యులుగా, శ్రీ సరస్వతి విద్యా పీఠం వ్యవస్థాపక సభ్యులుగా, వైదేహీ ఆశ్రమం నిర్వహణ, ఇంకా అనేక ట్రస్టులలో క్రియాశీలక సభ్యులుగా పని చేశారు, చేస్తున్నారు.

దేశ్ ముఖ్ మృతిపట్ల ఆర్.ఎస్.ఎస్. సరసంఘచాలక్ మాననీయ శ్రీ మోహన్ భాగవత్ జీ, సర్ కార్యవాహ మాన్య శ్రీ భయ్యాజీ జోషి, సహ సర్ కార్యవాహ మాననీయ శ్రీ దత్తాత్రేయ హోసబలే జీ, ఇతర ప్రముఖులు తమ తీవ్ర సంతాపాన్ని వెలిబుచ్చారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. దేశ్ ముఖ్ సంఘానికి అంకితమైన ఒక చక్కని కార్యకర్త అని తమ సందేశంలో తెలిపారు.

స్వర్గీయ దేశ్ ముఖ్ గారి భౌతిక కాయానికి రేపు ఉదయం (24 అక్టోబర్, శుక్రవారం) సైదాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయి.

1 comment:

Anonymous said...

Hrudaya Poorwaca Santapamu - Chiwari waracoo Sangha Caarya lo Unna Dhanaya Jeewi.

Post a Comment